Friday, July 26, 2024

22న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. ఈనెల 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న శ్రీశోభకృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ది నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి-భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.

ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 22 వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంను టిటిడి రద్దుచేసింది. మార్చి 21, 22 వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దుచేసింది. ఈ కారణంగా మార్చి 20, 21 తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా ‘టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement