Monday, May 6, 2024

Cat bite : పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి

పిల్లి క‌రిస్తే మ‌నుషులు చ‌నిపోతార‌ని ఎప్పుడూ చూడ‌ని, విన‌ని ఘ‌ట‌న‌. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఓ పిల్లి క‌ర‌వ‌డంతో ఇద్ద‌రు మ‌హిళ‌లు చ‌నిపోయిన ఘ‌ట‌న చోటుచేసుకుంది.. సాధారణంగా పాము కాటుకు, కొన్నిసార్లు కుక్కకాటుకు గురై చనిపోవడం చూసుంటాం. కానీ పిల్లి కరిచి చనిపోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతోంది. అలాంటి ఓ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పిల్లికాటుకు గురై ఇద్దరు మహిళలు ఒకే రోజు మృత్యువాతపడ్డారు. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే..ఇద్దరి మహిళల్ని బలితీసుకున్న ఆ పిల్లి..కుక్కకాటుకు బలైంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడ దళితవాడ కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలో ఉంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43) లను రెండు నెలల కిందట ఓ పిల్లి కరిచింది.

అప్పట్లో ఆ మహిళలిద్దరూ వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజెక్షన్‌ చేయించుకుని మందులు వాడారు. కొద్దిరోజులకు ఉపశమనం కలగడంతో యథావిధిగా తమ పనులు చేసుకో సాగారు. అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికి అనారోగ్యం తిరగబెట్టింది. కమలను మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్పించగా.. నాగమణి శుక్రవారం విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. కమల కూడా శనివారం ఉదయం10 గంటలకు చనిపోయింది. వారిద్దరికీ పిల్లి కరవడంతో ఇద్దరికీ ర్యాబిస్‌ సోకిందని వైద్యులు చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆ ఇద్దరు మహిళలను కరిచిన పిల్లి కుక్కకాటుకు బలైంది. అయితే పిల్లిని కరిచిన కుక్క కూడా కొద్దిరోజులకే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. పిల్లి క‌రిస్తే చ‌నిపోవ‌డ‌మేంట‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement