Friday, May 3, 2024

వరంగల్‌లో కొత్తరకం రెస్టారెంట్​, ఫుడ్​ ఆర్డర్​ చేస్తే టాయ్​ ట్రైన్​లో వస్తుంది.. దేశంలోనే అతిపెద్దది!

భారతదేశంలో అతిపెద్ద టాయ్‌ ట్రైన్‌ నేపథ్యంగా కలిగిన రెస్టారెంట్‌, ప్లాట్‌ఫామ్ 65ని వరంగల్‌లో ఇవ్వాల (శనివారం) ప్రారంభించారు. ప్లాట్‌ఫామ్‌ 65 ఆధ్వర్యంలో వినూత్నమైన డైనింగ్‌ కాన్సెప్ట్‌, భోజన ప్రియులకు అద్వితీయమైన ఆహార అనుభవాలను అందించడంతో పాటు, ఆహారాన్ని బొమ్మ రైలులో సప్లయ్​ చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులకు మల్టీ క్యుసిన్‌ రుచులను విలాసవంతమైన వాతావరణంలో అందిస్తామన్నారు. ఈ నూతన ఔట్‌లెట్‌ వరంగల్‌ మార్కెట్‌లో రెస్టారెంట్‌ ప్రవేశానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

ఆహార ఆభిమానుల నుంచి స్థిరంగా ప్రశంసలు పొందడంతో పాటు రెండేళ్లలో అత్యద్భుతమైన కస్టమర్‌ రివ్యూలను పొందిన ప్లాట్‌ఫామ్‌ 65 తమ శాఖలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో విస్తరిస్తోంది. ఇటీవలనే తమ ఏడో ఔటలెట్‌ను బెంగళూరులో కూడా ప్రారంభించారు. ఇక.. వరంగల్‌లో తమ నూతన ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్లాట్‌ఫామ్‌ 65 తమ వినియోగదారులకు నోరూరించే ఆంధ్ర, తెలంగాణ, చైనీస్‌ వంటకాల రుచులను ఆస్వాదించే అవకాశం అందిస్తున్నట్టు తెలిపింది.

ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని రైల్వే స్టేషన్‌ తరహాలో డిజైన్‌ చేశారు. ఇక్కడ సీట్లు రైల్‌ సీట్లను ప్రతిబింబించడంతో పాటు ప్రతి టేబుల్‌ బెంగళూరు, మైసూర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి, విజయవాడ తదితర పేర్లను కలిగి ఉంటాయి. ఈ రైలు ఒకేసారి రెండు మీల్స్‌ను మోసుకుని వెళ్తుంది. రెస్టారెంట్‌ ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ ‘‘ఈ తరహా థీమ్‌ రెస్టారెంట్‌లు వరంగల్‌కు మరింత మంది పర్యాటకులకు ఆకర్షిస్తాయి. ప్లాట్‌ఫామ్‌ 65 బృందాన్ని అభినందిస్తున్నాను’’ అని అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌, వరంగల్​ 30వడివిజిన్ కార్పొరేటర్​ బోడ దిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్‌ 65 (వరంగల్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఈ మైలురాయి వేడుక చేయడంపై సంతోషంగా ఉన్నామన్నారు. వరంగల్‌కు ప్లాట్‌ఫామ్‌ 65 చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్‌లో ఈ కాన్సెప్ట్‌ రెస్టారెంట్‌ అపూర్వ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement