Saturday, May 4, 2024

ట్రాక్ట‌ర్ బోల్తా.. ఒక‌రు మృతి, మ‌రొక‌రికి తీవ్ర గాయాలు

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పరకాల – కాళేశ్వరం ప్రధాన రహదారి మంజూర్ నగర్ వద్ద ఊహించని ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మ‌ర‌ణించాడు.. అదే ప్ర‌మాదంలో మరొక వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘటన ఇవ్వాల (గురువారం) సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారి మంజూర్ నగర్ వద్ద ఓ ట్రాక్టర్ ట్రాలీలో సుమారు 5 క్వింటాళ్ల ఐరన్ లోడ్ వేసుకుని భూపాలపల్లి వైపు వెళ్తుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాక్టర్ అధికలోడు వుండటంతో అదుపు తప్పి ట్రాలీ బోల్తా పడింది.

అయితే ఆ సమయంలో రోడ్డు పక్కన పాదచారులు తాడిపత్రి డానియల్ (40 ) సింగరేణి కార్మికుడు, మరో వ్యక్తి తో కలిసి నడిచి వెళ్తున్నారు. ఊహించని విధంగా ఒక్కసారిగా ట్రాలీ బోల్తాపడటంతో అందులోని ఐరన్ లోడ్ (ఇనుప చువ్వలు) వారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో డానియల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి గాయాలు కాగా క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. అధికలోడు వుండటం వల్లనే ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement