Friday, April 26, 2024

ముహూర్తం ఖరారు.. ఏప్రిల్‌ 30న అట్టహాసంగా తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. పలు సందర్భాలుగా వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ నూతన సచివాలయానికి గ్రహణం వీడనుండగా, జూన్‌ 2న తెలంగాణ అమర వీరుల సృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చేపట్టాలని ఇప్పటికే క్యాబినెట్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వరుసగా అన్ని నిర్మాణాలను ప్రారంభించుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. భారీ వ్యయంతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అమరులను స్మరించుకునే అత్యున్నతంగా స్మృతి చిహ్నం నిర్మాణం, బాబాసాహెబ్‌ స్పూర్తిని చాటి చెప్పేలా 125 అడుగుల భారీ విగ్రహాలు తెలంగాణకు మకుటాయమానంగా నిలవనున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ మూడు నపిర్మాణాలు హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత పెంచేలా సిద్దమయ్యాయి. ఏ ప్రభుత్వం కూడా కనీసం కలలో కూడా ఆలోచించని అతి భారీ నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ సొంత ఆలోచనతో అంకురార్పణ చేశారు.

అంతే పట్టుదలతో సీఎం పట్టుబట్టి మరీ పూర్తి చేయించారు. ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చి హైదరాబాద్‌ కొత్తదనానికి మరింత శోభను తేనున్నాయి. అతర్యంత సుందరంగా, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సకల హంగులతో తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయం నిర్మితమైంది. ఈ నిర్మాణం త్వరలో ప్రజలకు, ప్రభుత్వానికి అందుబబాటులోకి రానున్నది. ఈ మేరకు తుది మెరుగులను సీఎం కేసీఆర్‌ పరిశీలించి త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. తొలుత ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించాలని యోచించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. కాగా ఎంతో ప్రతిష్టాతక్మంగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్‌ భవన్‌గా నామకరణం చేశారు. తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్‌ 27న కేసీఆర్‌ భూమి పూజ నిర్వహించారు.

- Advertisement -

సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో సకల సౌకర్యాలతో, అధునాతన పద్దతిలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. భూమి పూజ చేసిన సమయంలో ఈ నిర్మాణ పనులను 9 మాసాల్లో పూర్తి చేయాలని తొలుత భావించారు. అయితే కరోనా కారణంగా సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. గత ఏడాది దసరా నాటికే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికీ కూడ పనులు పూర్తి కాలేదు. కాగా కొత్త సచివాలయం పార్కింగ్‌ స్థలంలో 300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్‌ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ, రెండు, మూడో అంతస్థుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు- ఉంటాయి. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్‌ చాంబర్‌ ఉంటు-ంది. ఏప్రిల్‌ 30న అందుబాటులోకి రానున్న నూతన పరిపాలనా సౌధం 9లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలవనుంది. విశాలమైన కారిడార్లతో ఎకో ఫ్రెండ్లీ వాతావరణంతో సౌర విద్యుత్‌ వ్యవస్థతతో తణుకులీలనుంది. గ్రీన్‌ బిల్డింగ్‌ మార్గదర్శకాలతో భవనం నిర్మితమైంది.

2020 జనవరి 4న ప్రారంభైన నిర్మాణ పనులు మొదట రూ. 400కోట్ల అంచనా వ్యయంతో, ఆ తర్వాత పెరిగిన వ్యయం కారణంగా రూ. 617కోట్లకు చేరుకుంది. మొత్తం విస్తీర్ణం 29.68 ఎకరాలుకాగా వాస్తు దోషాలను నివారించి 20 ఎకరాల్లో దీర్గచతురస్రాకారంలో కాంప్లెక్స్‌ నిర్మితమైంది. దక్కన్‌, కాకతీయ శైలిలో ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్‌ డిజైన్‌తో ఆరు అంతస్తుల్లో భవనం పూర్తిస్థాయికి చేరింది. భవనంపై ఐదు అంతస్తుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్‌ టవర్‌ నిర్మించారు. 11 అంతస్తుల ఎత్తు నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తుకే పరిమితం కానుంది. సీఎం కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16మంది మంత్రుల కార్యాలయాలను 2నుంచి ఐదో అంతస్తు వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండో అంతస్తుల్లో జీఏడీ, ఆర్ధిక శాఖలు, 3నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటరీ, కమిషనర్‌, మొత్తం సిబ్బంది ఒక శాఖకు చెందిన పాలనా వ్యవహారం అంతా ఒకేచోట కొలువుదీరనుంది.

7నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు ఉంటాయి. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ఉంటాయి. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తు ఐదు టన్నుల బరువుతో జాతీయ చిహ్నమైన 4 సింహాలుంటాయి. భవనం మధ్యలో విశాలమైన కోర్ట్‌ యార్డ్‌ వచ్చేలా డిజైన్‌ ఉంది. ప్రధాన భవనం 2.45 ఎకరాల్లో, కోర్ట్‌ యార్డ్‌ 1.98 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆరో అంతస్తుకు ప్రత్యేకంగా లిఫ్టుును ఏర్పాటు చేశారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా సీఎం కోసం ఈ లిఫ్టుును వాడనున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఉన్నతాధికారులకు, సందర్శకులకు వేర్వేరుగా లిఫ్టుులు, ద్వారాలను ఏర్పాటు చేశారు. భవనం చుట్టూ వాహనాలు తిరిగేలా రహదారులను నిర్మించారు. వెలుపల హెలీప్యాడ్‌, పచ్చిబయళ్లు, వాటర్‌ ఫౌంటేన్లు ఉంటాయి. సిబ్బంది వాహనాల పార్కింగ్‌కు 2.45 ఎకరాలను కేటాయించారు. సందర్శకుల వాహనాలకు వెలుపల 1.21 ఎకరాల్లో పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక కాంప్లెక్స్‌ బైట ఆలయం, మసీదు, చర్చి తదితరాలను 8 ఎకరాల్లో నిర్మించారు. అత్యంత అధునాతన భద్రతా ఏర్పాట్లు, బుల్లెట్‌ ఫ్రూఫింగ్‌ వంటి చర్యలు పూర్తి స్థాయికి చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement