Tuesday, May 7, 2024

సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లు నగర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో , మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఈనెల 17వ తేదీన నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం, ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరాపార్కు వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో పర్యటించారు. హైదరాబాద్ లో 17వ తేదీన పీపుల్స్ ప్లాజా నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారని మంత్రులు వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను మంత్రులు నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులతో కలసి పర్యవేక్షించారు.

అనంతరం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో ఆదివాసీ భవన్, బంజారా భవన్ ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ పాల్గొనే సభలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని చాటేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రసమయి బాలకిషన్, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్ర నాయక్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement