Saturday, May 18, 2024

కేంద్రం, రాష్ట్రాల మధ్య కరెంటు గొడవ.. ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్‌ నేషన్‌ వన్‌ గ్రిడ్‌, వన్‌ ఫ్రీక్వెన్సీ, వన్‌ ప్రైస్‌ ఫార్ములా రాష్ట్రాలతో విద్యుత్‌ ఘర్షణలకు కారణం కాబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాజాగా వపర్‌ సెక్టార్‌పై గొడవ ప్రారంభమైంది. వికేంద్రీకరణమై ఉన్న దేశ విద్యుత్‌ రంగ వ్యవస్థను కేంద్రప్రభుత్వం కేంద్రీకృతం చేయాలని భావించడం, అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన పాన్‌ ఇండియా తరహా మోడ ల్‌ ప్రవేశ పెట్టాలని భావించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కేంద్రబిందువు అవుతోంది. మార్కెట్‌ బేస్డ్‌ ఎకనామిక్‌ డిస్పాచ్‌ (ఎంబిఈడి)మెకానిజం పేరుతో కేంద్ర విద్యుత్‌ శాఖ దేశవ్యాప్తంగా కేంద్రీకృత షెడ్యూల్‌ను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

తద్వారా దేశవ్యాప్తంగా ఏడాదికి విద్యుత్‌ వినియోగం సుమారు 1,400 బిలియన్‌ యూనిట్ల ఉండవచ్చని కేంద్ర విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది. దీంతో, కేంద్రం పూర్తిగా డీసెంట్రలైజ్‌డ్‌ పద్ధతికి స్వస్తి చెప్పాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. అయితే, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం 2003 విద్యుత్‌ సంస్కరణలను ఉల్లంఘించడమే. కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రవేశ పెట్టనున్న ఎంబీఈడీ మోడల్‌ను కేంద్రం వన్‌ నేషన్‌, వన్‌ గ్రిడ్‌, వన్‌ ఫ్రీక్వెన్సీ, వన్‌ ప్రైస్‌ ఫార్ములాతో ప్రజల ముందుకు రావాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రాల్లో ఎంబిఈడీ మొదటి దశను ఏప్రిల్‌ నుంచి ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం భావించినా, ఆ దిశగా ముందుకు సాగలేదు. ఎంబిఈడీ మొదటి ఫేజ్‌ను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై కేంద్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

కేంద్ర ప్రభుత్వ వన్‌ నేషన్‌, వన్‌ గ్రిడ్‌ ఫార్ములాపై కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌, కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా అడ్వైజరీ బోర్డు సభ్యుడు ఎస్‌ఎల్‌ రావ్‌ మాట్లాడుతూ, కేంద్రం ప్రతిపాదించిన ఎంబిఈడీ ప్రస్తుతమున్న రాజ్యాంగ నిబంధనలు, చట్ట పరిధి, మరియు మార్కెట్‌ సెక్టార్‌కు అనుకూలంగా లేదని, ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడం కంటే, కొత్తగా ఎదురయ్యే సవాళ్లు ఎక్కువని అభిప్రాయ పడ్డారు. గ్రిడ్‌లపై కేంద్రం గుత్తాధిపత్యం సాధించాలని భావించడం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించడమని ఎస్‌ఎల్‌ రావ్‌ అభిప్రాయ పడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన ఎంబిఈడీ మోడల్‌ విద్యుత్‌పై బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా, ఇతర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్‌ ఫైట్‌ ప్రారంభమైనట్లు విద్యుత్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement