Thursday, May 2, 2024

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : సబితారెడ్డి..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : మే నెలలో జరిగే ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారంనాడు తన కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముందుగా పరీక్షా కేంద్రాలను సందర్శించి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం 9,07,396 మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. ఎండల తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్‌ ప్రసారం జరిగగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్యశాఖ సిబ్బందిని, ఓఆర్‌ఎస్‌ పాకెట్లను, మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు.

పరీక్షా సమయంలో కేంద్రాల చుట్టుపక్కల జీరాక్స్‌ షాపులను మూసివేయాలని, ఆ ప్రాంతమంతా 144 సెక్షన్‌ విధించాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్‌ అందుబాటులో లేకపోతే సమకూర్చుకోవాలని, అందుకయ్యే నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని పేర్కొన్నారు. పరీక్షలంటే భయాందోళనకు గురయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, పాఠశాల విద్యా డైరెక్టర్‌ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. ఇంటర్‌ పరీక్షలు మే 6 నుంచి, పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement