Thursday, May 2, 2024

నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్

ర్రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఎల‌క్ర్టానిక్ త‌యారీ రంగానికి ప్రోత్సాహంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కో ఆకాంక్షను నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. మన నీళ్లు మన పంటపొలాలకే పారుతున్నాయని.. మన నిధులు మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టుకుంటున్నామన్నారు. నియామకాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టిందని తెలిపారు. ఎల‌క్ర్టానిక్ వాహ‌నాల త‌యారీ రంగ ప‌రిశ్ర‌మలో స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. గ‌త 6 ఏళ్లలో 23 వేల కోట్ల పెట్టుబ‌డులు తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు ఈ రంగంలో 50 వేల ఉద్యోగాలు మాత్ర‌మే ఉండేవని, రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత అద‌నంగా ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు క‌ల్పించుకున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement