Thursday, July 25, 2024

National : తేజ‌స్వీయాద‌వ్ ఎస్కార్ట్ కు ప్ర‌మాదం… ఎస్కార్ట్ డ్రైవర్‌ మృతి, ఆరుగురికిగాయాలు…

బీహార్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వీయాదవ్ ఎస్కార్ట్ అదుపు త‌ప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఎస్కార్ట్ వాహ‌నం డ్రైవ‌ర్ అక్క‌డిక్క‌డే మృతి చెందగా ఆరుగురికి గాయాల‌య్యాయి. పూర్నియా బెలారీలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయపడిన పోలీస్‌ సిబ్బందిని పూర్నియా జీహెచ్‌సీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజస్వీ యాదవ్ జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా సోమవారం అర్ధరాత్రి బిహార్‌లోని పూర్ణియాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్నియా-కతిహార్ ప్రధాన రహదారిపై తేజస్వీ ఎస్కార్ట్‌లోని వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

- Advertisement -

వెంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రులను పూర్నియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తిని మహమ్మద్ అలీమ్‌గా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో తేజస్వీ అక్కడ ఉన్నాడా లేడా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. కాగా, తేజస్వీ చేపట్టిన జన్ విశ్వాస్ యాత్ర ఫిబ్రవరి 20న ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement