Wednesday, May 1, 2024

వైసీపీ రాక్షస సంస్కృతి శ్రుతి మించుతోంది: అచ్చెన్నాయుడు

వైసీపీ ప్రభుత్వం పాలనను గాలి కొదిలేసి పనిదినాల్లో అక్రమాలు, సెలవుదినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడ్డట్టు కోర్టు సెలవు రోజుల్లోనే జగన్ ప్రభుత్వం కక్ష్య పూరితంగా టీడీపీ నేతల ఇళ్లను, భవనాలను కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున దొంగల్లా వచ్చి భవనాన్ని కూల్చడం దారుణమన్నారు.

విద్వేషం, విధ్వంసం లేకుండా వైసీపీకి ఉనికి లేదని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి ప్రజా వేదిక మొదలు ప్రతిపక్ష నేతల ఇల్లు ఎన్ని కూల్చారో లెక్కే లేదని, రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా లేక రాక్షసులు పాలిస్తున్నారా? అని నిలదీశారు. రోజురోజుకు వైకాపా రాక్షస సంస్కృతి శ్రుతి మించుతోందని, అధికారం శాశ్వతం కాదని, జగన్ సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement