Sunday, May 5, 2024

త‌మిళ‌నాడులో క‌ల్తీ మ‌ద్యం – 13కి చేరిన మ‌ర‌ణాలు

విల్లుపురం – తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. విల్లుపురం జిల్లాలోని మరక్కాణంలో తొమ్మిదిమంది, చంగల్పట్టు జిల్లా మధురంతకంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో కల్తీసారా విక్రయాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై అధికారులు కొరడా ఝలిపించారు. ముగ్గురు ఇన్‌ స్పెక్టర్లు, నలుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ తెలిపారు. ఈ కేసులో పుదుచ్చేరి నుంచి అక్రమంగా కల్తీసారా తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అమరన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనితోపాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement