Friday, April 26, 2024

తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలి: స్వరూపానందేంద్ర

చాతుర్మాస దీక్షలో ఉన్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు గురువారం రిషికేష్‌లో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో ఉచిత దర్శనాలను కరోనా కారణంగా నిలిపివేయడం సరికాదని, నిర్దిష్ట సంఖ్యలో భక్తులను నిత్యం ఉచిత దర్శనానికి అనుమతించాలని వైవీ సుబ్బారెడ్డికి సూచించారు. కరోనా కారణంగా నిర్వీర్యమవుతున్న హిందూ ధర్మ ప్రచారంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

నూతన ఆలయాల నిర్మాణంపై శ్రద్ధ చూపుతున్నట్లే, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సైతం టీటీడీ కృషి చేయాలని స్వరూపానందేంద్ర తెలిపారు. దేవాదాయశాఖ, టీటీడీ కలిసి ధర్మ ప్రచారం కోసం చైతన్య రథాలను నూతనంగా రూపొందించాలన్నారు. వైఎస్సార్ హయాంలో భజన బృందాలను ప్రోత్సహించినట్లే ఈ ప్రభుత్వం హిందూ ధర్మ ప్రచారానికి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీ నిర్వహణలోని హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా భజన బృందాలకు ఉచితంగా ప్రచార సామగ్రిని అందజేయాలని సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టును ప్రక్షాళన చేయాలని అన్నారు. దేవాదాయ శాఖలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పారు. ఉన్నత ఆలోచనలతో పనిచేసే అధికారులను ఆలయాలకు ఈవోలుగా నియమించాలని అన్నారు. ఖాళీగా ఉన్న వేదపారాయణదారుల పోస్టులను టీటీడీ భర్తీ చేయాలని స్వరూపానందేంద్ర సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: ఏపీలో నకిలీ చలానాల స్కాంను చేధించిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement