Saturday, April 27, 2024

ఇంజనీరింగ్‌లో మిగులు సీట్లు 22 వేలు.. 16న రెండో దశ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మొదటి దశలో భర్తీకాగా మిగిలిన 22,820 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ నడుస్తోంది. ఇప్పటి వరకు 3374 మంది స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారు. ప్రాసెసింగ్‌ ఫీజు, స్లాట్‌ బుకింగ్‌కు ఈ రోజు ఆఖరు. ధ్రువపత్రాలను బుధవారం పరిశీలించనున్నారు. ఈనెల 13 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. 16న రెండో విడత సీట్లను కేటాయించనున్నారు. అయితే మొత్తం 22వేలకు పైగా సీట్లల్లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ సంబంధిత కోర్సుల్లోనే అత్యధికంగా 16,776 సీట్లు ఉన్నాయి. ఇందులోనూ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో 6510 సీట్లు ఉండగా, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (ఏఐఎంఎల్‌)లో 3419 సీట్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో 1148 సీట్లు, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (డేటా సైన్స్‌)లో 2418 సీట్లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ డేటా సైన్స్‌లో 1176 సీట్లు, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో 37 సీట్లు, సీఎస్‌ఈ సైబర్‌ సెక్యూరిటీలో 830 సీట్లు ప్రధానంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్స్‌ బ్రాంచ్‌లో 4424 సీట్లు ఉన్నాయి. సివిల్‌, మెకానికల్‌ కోర్సుల్లో 1331 సీట్లు, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, డెయిరింగ్‌, మైనింగ్‌, ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో 289 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిలో మిగిలిన సీట్లకు తుదిశలో భర్తీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement