Saturday, July 27, 2024

కరోనా బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే కేసులు పెడతారా: సుప్రీంకోర్టు సీరియస్

కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే పోలీసులు వారిపై కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఎవరైనా వేధిస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా భావిస్తామని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. ‘ఒక వ్యక్తిగా, జడ్జిగా ఈ విషయం నాకు ఆందోళన కల్గిస్తోంది. ఒక వ్యక్తి తన బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తే… దానిని నిషేధించే ప్రయత్నం చేస్తారా…? ప్రజల ఆవేదనను వినండి. ఎవరైనా వ్యక్తి తనకు ఆక్సిజన్‌ కావాలని, బెడ్‌ కావాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే… వారిని వేధించడం సరికాదు. మనం ఇపుడు మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ఇటీవల తనకు ఆక్సిజన్‌ కావాలని ఓ వ్యక్తి ట్వీట్‌ చేయడం, దాన్ని ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ రీ ట్వీట్‌ చేస్తే యూపీ ప్రభుత్వం వారిపై కేసు పెట్టింది. ఎవరైనా బెడ్‌ లేదని, ఆక్సిజన్‌ లేదని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కేసు పెడతామని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement