Friday, May 3, 2024

మిథాలీని అభినందించిన మహేష్‌, లోకేష్

భారత మహిళల వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీ ఘనత సాధించడంతో ఆమెను అభినందిస్తూ ప్రముఖులు తమ సందేశాలు పంపుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మిథాలీ రాజ్ కు అభినందనలు తెలిపారు.

మిథాలీ రాజ్ ఓ అద్భుతమైన ఘనత అందుకున్నారని ప్రిన్స్ మహేష్‌బాబు కితాబిచ్చారు. ‘మమ్మల్ని అందిరినీ గర్వించేలా చేశావు మిథాలీ… ఇలాంటి ఘనతలు మరెన్నో సాధిస్తావు. నీకు వందనాలు ఛాంపియన్’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. అటు ‘అంతర్జాతీయస్థాయిలో 10 వేల పరుగులు సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్ కెప్టెన్’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. మిథాలీ… భారత మహిళా క్రికెట్ కు మూలస్తంభంలా కొనసాగుతోందని, ఔత్సాహిక యువ క్రికెటర్లకు ఓ స్ఫూర్తి అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement