దేశంలోనే మొదటి వాటర్ మెట్రోకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. కేరళ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వాటర్ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 25న ప్రారంభించారు. మరుసటి రోజు నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. రెండు రూట్స్లో వాటర్ మెట్రో సర్వీస్లు నడుపుతున్నారు. మొదటి రోజు కేరళ హై కోర్టు నుంచి వైపిన్ వరకు ఈ సర్వీస్ నడిచింది. 6,559 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించారు. రెండో సర్వీస్ వైటిళ్ల నుంచి కాకనాడ్ వరకు నడుస్తోంది.
రెండో రోజు 7 వేల మంది ప్రయాణికులు వాటర్ మెట్రోను ఉపయోగించుకున్నారు. హై కోర్టు నుంచి వైపిన్ రూట్లో టికెట్ ధరను 20 రూపాయలుగా, రెండో రూట్ వైటిళ్ల నుంచి కాకనాడ్ వరకు టికెట్ ధరను 30 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రూట్స్లో ప్రతి 15 నిముషాలకు ఒక సర్వీస్ను నడుపుతున్నారు. వాటర్ మెట్రో టెర్మినల్ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడుస్తున్నాయి.
వాటర్ మెట్రోను 1,136.83 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. మొత్తం 10 ఐలాండ్స్, 38 టెర్మినల్స్ను కనెక్ట్ చేస్తూ ఈ సర్వీస్లు నడుస్తున్నాయి. మొత్తం 76 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్ చేస్తోంది. ప్రస్తుతం 78 ఎలక్ట్రిక్ బోట్లను వాటర్ మెట్రో సర్వీస్లకు ఉపయోగిస్తున్నారు. ఇందులో 10 ఏసీ బోట్లు ఉన్నాయి.