Thursday, May 2, 2024

పూడికతో నిండిన సుంకేసుల జలాశయం.. స్థానికుల్లో వరద ముంచెత్తుతుందన్న భయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో, ఎగువన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సుంకేసుల జలాశయ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు జలాశయం నుంచి వరద గ్రామాలను, పంట పొలాలను ముంచేస్తోందన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం సుంకేసుల జలాశయం పూడికతో నిండిపోయింది. జలాశయం ఆనకట్టుకు ఇరువైపులా కరకట్టలు దెబ్బతిన్నాయి. ఆనకట్టుకు ఉన్న30గేట్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా సుంకేసుల కింద తెలంగాణలోని ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో మరేనది పైనా ప్రాజెక్టులు ఆనకట్టలు లేని రోజుల్లోనే బ్రిటీష్‌ పాలకులు తుంగభద్రనదిపై సంకేసుల జలాశయాన్ని నిర్మించారు. ప్రస్తుతం జలాశయంలో పూడిక చేర డంతో తుంగభద్ర వరదనీరు ఆనకట్టకు ఇరువైపులా ఉన్న గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

సుంకేసుల ఆనకట్ట ఆధునీకరణకు అప్పటి ఏపీ ప్రభు త్వం రూ.783 కోట్ల తో అంచనాలు రూపొందించింది. నదీ పరివాహక గ్రామాల ప్రజలు , రైతుల ఒత్తిడి మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రిపేర్లు చేసి చేతులు దులు పుకుంది. దీంతో రిజర్వాయర్‌లో పేరుకుపోయిన పూడికను తీసే పరిస్థితులు లేక, నీటి నిల్వ సామర్థ్యం కూడా భారీగా పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో సుంకేసుల జలాశయ పరివాహక గ్రామాల ప్రజలు వరద భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను ప్రారంభించి రాజోలిబండ మళ్లింపు పథకం ద్వారా 55వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement