Monday, May 6, 2024

విద్యార్థులకు ఊరట.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల దరఖాస్తుల్లో మార్పులు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తుల్లో మీసేవ మార్పులు చేయనుంది. ఈమేరకు మార్పులను సూచిస్తూ రెవెన్యూశాఖ, సీసీఎల్‌ఏ శాఖలు మీసేవ కమిషనర్‌కు లేఖ రాశాయి. రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం… వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌లకు సంబంధించి కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని సడలించి అన్ని రకాలుగా కుటుంబ ఆదాయం రూ.8 లక్షలు మించరాదని పేర్కొంది. ఈమేరకు 2021 ఆగస్టు 24న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మీసేవ ద్వారా తీసుకునే దరఖాస్తుల్లో మాత్రం ఎలాంటి మార్పలు చేయకపోవడంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపడుతున్న తరుణంలో పలువురు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దరఖాస్తుతో పాటు ధ్రువపత్రంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా మీసేవ కమిషనర్‌ను సీసీఎల్‌ఏ లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలోని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల కోసం అని దరఖాస్తుల్లో విడిగా పొందుపర్చాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం ఉన్న దరఖాస్తు యథావిధిగా కొనసాగనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం చేసే దరఖాస్తుల్లో ఆస్తుల వివరాల విభాగాన్ని తొలగించనున్నారు.
ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ప్లాట్లు, ఫ్లాట్లు వివరాల విభాగాన్ని కూడా తొలగించనున్నారు. ధ్రువపత్రంలోనూ ఆస్తుల వివరాలకు సంబంధించిన విభాగం లేకుండా మార్పులు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. దీనికనుగుణంగా ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ సర్వీసులోని దరఖాస్తులో మార్పులు చేయాలని మీసేవకు స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement