Thursday, April 25, 2024

గ్రూప్‌-1 పరీక్షకు కఠిన నిబంధనలు అమలు.. బూట్లు ధరించి రావొద్దు, 10.15 తర్వాత నో ఎంట్రీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 11న తెలంగాణలో నిర్వహించనున్న గ్రూప్‌-1 పరీక్షకు అధికారులు కఠిన నిబందనలు అమలు చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు, నిబంధనలు అమలు చేయబోతున్నారు. అభ్యర్థులు బూట్లు ధరించి రావొద్దని, చెప్పులతో రావాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రంలో ఇతరులతో మాట్లాడడం, ఎలాంటి స్లోగన్స్‌ ఇవ్వకూడదని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) హెచ్చరించింది.

ప్రశాంతమైన వాతావరణాన్ని కేంద్రాల్లో చెడగొట్టే ప్రయత్నాలను చేసినా కఠిన చర్యలు తప్పవని సూచించింది. అభ్యర్థులకు రెండు దశల్లో తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని, దాంతో పాటు భవిష్యత్తులో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే ఎలాంటి పోటీ పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈనెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.

- Advertisement -

పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసేయనున్నారు. ఉదయం 10.15 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఒకరోజు ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తే పరీక్ష రోజు కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చని సూచించారు. పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, క్యాలుకులేటర్‌, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపారు. బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌లను మాత్రమే అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని, వాటిని మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ తదితర ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఓఎంఆర్‌ షీట్‌లో వైట్‌నర్‌, చాక్‌ పౌడర్‌, బ్లేడ్‌, ఎరేజర్‌ లాంటివి వాడకూడదని అభ్యర్థులకు సూచించారు. గతేడాది అక్టోబర్‌ 16న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement