Monday, April 29, 2024

Special trains | దీపావళికి ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ళు..

అమరావతి, ఆంధ్రప్రభ : రానున్న దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. అటు చెన్నై నుంచి భువనేశ్వర్‌ వరకు నడిచే సుదూర ప్రాంతాల రైళ్ళు రాష్ట్రం మీదుగా పలు రైల్వే స్టేషన్లలో ఆగ నున్నాయి. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం పండుగ సీజన్‌లో చెన్నై సెంట్రల్‌ – సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.

ఈ నెల 11, 18, 25 తేదీల్లో 06071 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్‌ ఫాస్ట్‌ రైలు నడవనుంది. ఆయా తేదీల్లో చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది.

ఇక తిరుగు ప్రయాణం కోసం13, 20, 27 తేదీల్లో 06072 స్పెషల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సంత్రాగచ్చిలో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రాష్ట్రంలో ప్రవేశించాక గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

- Advertisement -

అదేవిధంగా ఈ నెల 13, 20, 27 తేదీల్లో 06073 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – భువనేశ్వర్‌ ప్రత్యేక రైలును రైల్వే శాఖ నడపనుంది. చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి11.45 గంటలకు బయలుదేరనున్న ఈ రైలు మరుసటిరోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది.

అలాగే ఈ నెల 14, 21, 28 తేదీల్లో 06074 భువనేశ్వర్‌ – డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

రైళ్ల రద్దు పొడిగింపు..

ఇదిలావుండగా విజయవాడ రైల్వే డివిజన్‌లో మరమ్మతుల కారణంగా రద్దయిన పలు రైళ్ళ రద్దు పొడిగించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. బిట్రగుంట – చెన్నై – బిట్రగుంట ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 5వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. తాజాగా 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు- వెల్లడించింది. అలాగే కాట్పాడి – తిరుపతి – కాట్పాడి ప్యాసింజర్‌ రైళ్లతోపాటు అరక్కోణం -కడప – అరక్కోణం మెము రైళ్లను ఈ నెల 12వ తేదీ వరకు రద్దు చేసినట్లు- ప్రకటించింది. కాగా ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement