Friday, May 17, 2024

రష్యన్‌ ఆర్మీ దాడిలో ఆరేళ్ల బాలిక మృతి.. కొన ఊపిరితో తండ్రి..

ఉక్రెయిన్‌పై రష్యా తన ప్రతాపం మొత్తం చూపిస్తున్నది. ప్రపంచ దేశాల ఎదుట చేస్తున్న ప్రకటనలకు.. ఉక్రెయిన్‌పై దిగుతున్న దాడులకు ఎలాంటి సంబంధాలు ఉండటం లేవు. ఉక్రెయినియన్‌ ఆర్మీ క్యాంపులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామన్న రష్య.. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ఆస్పత్రులు, పరిపాలనా భవనాలు, నివాస సముదాయాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అనాథ శరణాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నది. రష్యా ఈ సైనిక చర్యతో అమాయకులైన ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఆర్మీ జరిపిన కాల్పుల్లో.. ఓ ఆరేళ్ల ఉక్రెయిన్‌ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. రష్యా ఆర్మీ నుంచి భారీ షెల్లింగ్స్‌ దూసుకొస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌ ఓడరేవు నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్‌ ఆర్మీ ప్రయత్నిస్తున్నది. అయితే ఉక్రెయిన్‌ సైన్యం వారి దాడులను ధీటుగా తిప్పికొడుతున్నది. రష్య తరఫు నుంచి భారీ షెల్లింగ్‌ జరుగుతున్నది. ఈ ఘటనలో 6 ఏళ్ల బాలికకు గాయాలు కావడంతో.. ఆమెను స్థానికులు, ఉక్రెయిన్‌ సైన్యం అంబులెన్స్‌లో సిటీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో బాలిక తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతని తలకు బలమైన గాయమైంది. రక్తం కూడా కారుతున్నది.

వైద్యుల ప్రయత్నం విఫలం..

ఓ వైద్య బృందం.. తీవ్రంగా గాయపడిన 6ఏళ్ల బాలికను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఛాతిని పంప్‌ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు, నర్సులు ఎంతో కష్టపడ్డారు. చిన్నారిని స్పైషలైజ్డ్‌ చిల్డ్రన్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇంజెక్షన్‌ చేసి డీ ఫిబ్రిలేటర్‌తో బతికించేందుకు ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. కానీ ప్రాణం కాపాడలేక పోయామన్నారు. తండ్రి కూతురు సమీపంలోనే దాడులు జరిగాయి. అక్కడ జరిగిన దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కీవ్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రేనియన్‌ నగరంలోని చెర్నిహివ్‌లోని ఓ నివాస భవనంపై రష్యా ఆర్మీ క్షిపణితో దాడి చేసిందని స్టేట్‌ కమ్యూనికేషన్‌ సర్వీస్‌ తెలియజేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement