నల్లసముద్రంలో మునిగిపోయిన తమ యుద్ధనౌక మాస్క్వాలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎంతమంది మరణించారు, ఎందరు బతికి బయటపడ్డారు అనే అంశం సహా ఏ వివరాలు చెప్పబోమని మంగళవారంనాడు రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ తన నెప్ట్యూన్ క్షిపణులతో దాడి చేయడంవల్ల మంటల్లో చిక్కుకుని మాస్క్వా నీట మునిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో యుద్ధనౌకలోని కెప్టెన్ సహా 510మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అణ్వాయుధాలు సముద్రంలో మునిగిపోయాయని అంతర్జాతీయ సమాజం చెబుతూండగా రష్యా నోరువిప్పడం లేదు. నౌకలోని సిబ్బందని రక్షించామని మాత్రం చెబుతోంది. ఎందరిని రక్షించారనే అంశంపై సహా ఏ వివరాన్నీ వెల్లడించబోమని స్పష్టం చేసింది. మాస్క్వాలో విధులకు హాజరైన తమ కుమారులు జాడ తెలియడం లేదని, వారి క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని సోషల్ మీడియా ద్వారా వారివారి తల్లిదండ్రులు చేస్తున్న వినతులపై రష్యా స్పందిస్తూ నౌకలోని సిబ్బందిని రక్షించామని మాత్రమే పేర్కొంది.
మిగతా వివరాలను చెప్పడం లేదు. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధ దిమిత్రి పెస్కోవ్ మంగళవారం మాట్లాడుతూ ఈ విషయంపై తామేమీ చెప్పలేమని, రక్షణశాఖ దీనిపై ప్రకటన చేస్తుందని చెప్పారు. కాగా నౌకలోని 37మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, 100మంది తీవ్రంగా గాయపడ్డారని, మరికొన్ని వందలమంది ఆచూకీ లేదని స్థానిక పత్రికల్లో కథనాలు వస్తున్న నేపథ్యంలో సైనికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..