Friday, April 26, 2024

Safe landing – అపాచీ హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ – పైలెట్ సేఫ్

మ‌ధ్య‌ప్ర‌దేశ్ – భారత వాయుసేన కు చెందిన ఓ అపాచీ అటాక్‌ హెలికాప్టర్ మధ్యప్రదేశ్‌లోని భింధ్‌ వద్ద అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఈ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించడంతో పైలట్‌ వెంటనే దీనిని పొలాల్లో ల్యాండ్‌ చేశాడు. పైలట్‌ అప్రమత్తతో ఓ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఈ హెలికాప్టర్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి మళ్లీ గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దీనికి సాయం చేసేందుకు మరో హెలికాప్టర్‌ను అక్కడికి పంపారు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు సమాచారం. పైలట్‌ సురక్షితంగా ఉన్నారు. ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

భారత దళాల్లో వినియోగిస్తున్న హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత సైన్యానికి చెందిన ధ్రువ్‌ జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. అనిల్‌ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి. మార్చిలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతాల్లో ఓ సైనిక హెలికాప్టర్‌ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అదే నెలలో భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్‌ ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వారంతా సుర‌క్షింతంగా బ‌య‌డ‌ప‌డ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement