Thursday, April 25, 2024

లుగాన్‌స్క్‌ ఆస్పత్రిపై రష్యా దాడులు. మరియపోల్‌ ప్లాంట్‌నంచి సైనికుల తరలింపు

కీవ్ : ఖార్కీవ్‌నుంచి వెనక్కు తగ్గిన రష్యా పోలండ్‌ సరిహద్దుల్లోని లెవివ్‌ పట్టణంపై బాంబుల వర్షం కురిపించింది. మంగళవారంనాడు కనీసం పదిచోట్ల బాంబులు జారవిడవడంతో భారీ విధంసం సంభవించింది. వరుసగా పదిచోట్ల విస్పోటనాలు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మరోవైపు లుగాన్‌స్క్‌లోని సెవెరోడోనెట్‌స్క్‌ ఆస్పత్రిపైనా రష్యా దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. పొరుగుదేశంపై రష్యా దండయాత్ర ప్రారంభించి మంగళవారంనాటి 83 రోజులయ్యింది. ఇప్పటివరకు డోన్‌బాస్‌, మరియపోల్‌ వంటి రెండు ప్రధాన పట్టణాల్లో మినహా మరెక్కడా రష్యా పట్టు సాధించలేకపోయింది. మరోవైపు డోనెట్‌స్క్‌ ప్రాంతంలో రష్యా దాడుల్లో తొమ్మిదిమంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరియపోల్‌లోని అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌లో గాయపడిన 263 మంది ఉక్రెయిన్‌ సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. కాగా వారంతా లొంగిపోయారని రష్యా చెప్పుకుంది.

ఆ స్టీల్‌ప్లాంట్‌లో ఇప్పటికీ 800 మంది ఫైటర్లు ఉన్నట్లు అంచనా. వారిని రక్షించేందుకు ఉక్రెయిన్‌ అన్నివిధాలా కృషి చేస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఇక్కడ రష్యా దాడాలు చేస్తున్నప్పటికీ, నగరం అంతా ఆ దేశం గుప్పిటలోకి వెళ్లినా ఉక్రెయిన్‌ సైనికుల ప్రతిఘటనతో స్టీల్‌ప్లాంట్‌ ప్రాంతం మాత్రం చేజిక్కలేదు. కాగా ఖార్కీవ్‌నుంచి రష్యా సేనలను ఆ దేశ సరిహద్దులకు ఆవలివైపు వరకు తరిమికొట్టామని, ఉక్రెయిన్‌ పరిథిలోని ప్రాంతాలను తిరిగి సాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. కాగా రష్యా దాడుల్లో వెయ్యి పాఠశాలలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement