Saturday, May 18, 2024

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంపై విడుదల చేయాలి.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో.. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ.. ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. హోంగార్డులు, మోడల్‌ స్కూల్‌ సిబ్బందికి వేతనాలు వెంటనే అందించాని బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘ విలువైన భూముల అమ్మకం. రూ. లక్షల కోట్ల అప్పులు. ప్రజలపై పలు రకాల పన్నుల భారం. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో వ్యాటు ద్వారా ఆదాయం.

కరెంట్‌ చార్జీల పెంపు, భూ రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు. మధ్యం అమ్మకాల ద్వారా ఆదాయం. వివిధ రకాల పన్నుల ద్వారా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న వేల కోట్ల రూపాయిలు ఎటుపోతున్నాయి. బడా కాంట్రాక్టర్ల చేతిలోకి పోతున్నాయా..? . ధనిక రాష్ట్రమని మీరే చెబుతారు. పక్కరాష్ట్రానికి వెళ్లి పరిహారాలు పంచి వస్తారు. రూ. 200 కోట్లతో దేశ వ్యాప్తంగా ప్రకటనల కోసం ఖర్చు చేస్తారు. ఇలాంటి సమయంలో నిద్రహారాలు మాని శాంతిభద్రతల పర్యవేక్షణలో పని చేస్తున్న హోంగార్డులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు ‘ అని సీఎంకు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

విందులు, విలాసాలకు, విదేశీ విహార యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం నేల జీతం వస్తే కాని పూట గడవని హోంగార్డుల కుటుంబాల పరిస్థితిపై ఒక్కసారైనా ఆలోచన చేశారా..? అని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులు రైతు బంధు నిధులు ఇంకా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్ధంపడుతోందని ఆయన విమర్శించారు. విలాసాలు, రాజకీయ జల్సాలను ఆపి హోంగార్డులు, మోడల్‌ స్కూల్‌ సిబ్బందికి తక్షణమే వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ఆయా వర్గాలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం చేస్తోందని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement