Monday, April 29, 2024

రీఫార్మ్‌, పర్ఫామ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ ఇండియా కొత్త మంత్రం – ప్రధాని మోడీ

లక్నో: ఇండియా గత ఎనిమిదేళ్లుగా రీఫార్మ్‌పెర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ అనే మంత్రంతో అభివృద్ధి పథంలోకి దూసుకెళుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ యూపీ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2022ను ప్రధాని మోడీ శుక్రవారం లక్నోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని రూ.80వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న భిన్న రంగాలకు చెందిన 1400లకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో వ్యవసాయం, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఎంఎస్‌ఎంఈ, తయారీ, ఎనర్జీ, ఫార్మా, టూరిజం, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, హాండ్లూమ్‌ మరియు టెక్స్‌ టైల్‌ వంటి భిన్న రంగాల పరిశ్రమలు ఉన్నాయి.

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో భారతదేశాన్ని రీఫార్మ్‌, పర్ఫామ్‌, ట్రాన్స్‌ ఫార్మ్‌ అనే మంత్రంతో ముందుకు నడిపిస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పారిశ్రామీకరణ లక్ష్యంగా భారత ప్రభుత్వం పాలసీ, స్థిరత్వం, కోఆర్డినేషన్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. అందువల్లనే దేశం వేగంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తోందని, జీ20 దేశాల్లో వేగంగా అభివృద్ధిని సాధిస్తున్న దేశం ఇండియా అని చెప్పుకునేందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌ను అభినందించారు. రాబోయే పది సంవత్సరాల్లో దేశాన్ని నడిపే శక్తిగా యూపీ రూపొందనుందని అన్నారు. రాష్ట్ర యువతను అభినందించారు. రాష్ట్రంలో 80వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినందుకు గాను ప్రధాని వారిని ప్రశంసించారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.ఈసదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతమ్‌అదానీ, కుమారమంగళం బిర్లాలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యానాధ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీ ప్రభుత్వం మొదటిసారిగా యూపీ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను 2018, జూలై 29న నిర్వహించింది. ఆ సదస్సులో రూ,61,500 కోట్ల వ్యయంతో 81 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది. రెండో సదస్సును జూలై 28,2019న నిర్వహించగా, రూ.67 వేల కోట్లతో 290 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement