Monday, May 6, 2024

దీప్​ సిద్ధూకు బెయిల్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎర్రకోట వద్ద జరిగిన హింస కేసులో పంజాబీ సింగర్ దీప్ సిద్ధూకు బెయిల్ మంజూరైంది. ఆందోళనల వద్ద ఉన్నంత మాత్రాన అతడు ఇతరులను రెచ్చగొట్టినట్టు కాదని, రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతునిచ్చిన నిజాయతీ పరుడని దీప్ సిద్ధూ తరఫు లాయర్ వాదించారు.

అయితే, ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్ వాదిస్తూ.. హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే దీప్ సిద్ధూ అక్కడకు వెల్లారని, ఎర్రకోటపై దాడి జరగడానికి ప్రధాన కారణం అతడేనని అన్నారు. అతడికి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదని, ఇస్తే ఇంతకుముందు రెండు ఫోన్లను పగులగొట్టినట్టే ఇప్పుడూ సాక్ష్యాధారాలను మాయం చేస్తాడని ఆరోపించారు. అయితే, ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు.. దీప్ సిద్ధూకు బెయిల్ ను ఇస్తూ తీర్పునిచ్చింది.

ఎర్రకోటపై దాడిచేసేలా ఇతరులను దీప్ సిద్ధూ ప్రేరేపించారన్న ఆరోపణలతో అతడిపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే, ఆతడు తప్పించుకు తిరుగుతుండడంతో లక్ష రూపాయల నజరానానూ ప్రకటించారు. తర్వాత కొన్ని రోజులకే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దీప్ సిద్ధూను అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా అతడు జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. గత సోమవారం పిటిషన్ విచారణ సందర్భంగా తీర్పును వాయిదా వేసింది. తాజాగా ఈరోజు అతడికి బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement