Friday, May 10, 2024

రాగల రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల రెండురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.

శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

మరో వైపు గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్‌(టీ)లో 11.3 సెంటీమీటర్ల వర్షాపాతం కురిసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాపాతం రికార్డయ్యింది. అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement