Friday, May 17, 2024

Rain – తెలంగాణలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం – రైతన్నల హర్షం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే నిన్న, మొన్నటి వరకు వానల కోసం ఎదురుచూసిన రైతులు రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.. ఇక హైదరాబాద్‌ వ్యాప్తంగా వేకువజాము నుంచి వర్షం కురుస్తున్నది..

యాదాద్రి భువనగిరి జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదయింది. అత్యధికంగా భువనగిరి, రామన్నపేట మండలాల్లో 1.7 సెంటీమీటర్లు, నారాయణపూర్‌లో 1.4, అడ్డగూడూరులో 1.3, మోటకొండూరు, రాజాపేట మండలాల్లో 1.2 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదయింది. నల్లగొండ (జిల్లాలోని చండూరు మండలంలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది.ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌లో 9.2 సెం.మీ., ములుగులో 6.5, గోవిందరావుపేటలో 8.7, తాడ్వాయ్‌లో 9.2, ఏటూరునాగారంలో 7.9, కన్నాయిగూడెంలో 9.8, వాజీడులో 8.2, వెంకటాపురంలో 8.5, మంగపేటలో 8.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఓ మోస్తారుగా వర్షం కురుస్తున్నది. అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లాలో కూడా రాత్రి నుంచి విడవకుండా వాన పడుతున్నది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో కొన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 5.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది

వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దుగ్గొండిలో 5.02, వరంగల్‌లో 4.6, నర్సంపేటలో 3.6, ఖిలా వరంగల్‌లో 3.4, గీసుకొండలో 3.2, ఖానాపూర్‌, చెన్నారావుపేటలో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది..

- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాలో ఏకధాటిగా వర్షం కురుస్తున్నది. ఉట్నూరు, ఉంద్రవెల్లి, నార్నూర్‌ మండలాల్లో వాన పడుతున్నది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతుంది. కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ డివిజన్‌లో అత్యధికంగా నార్సింగిలో 2.6 సెంటీమీటర్లు, చేగుంటలో 2 సెం.మీటర్ల వర్షం కురిసింది. నర్సాపూర్‌ డివిజన్‌లో కుల్చారంలో 2.2 సెం.మీ., కౌడిపల్లిలో 1.72 సెం.మీ., మెదక్‌ డివిజన్‌లో హవేళీఘన్‌పూర్‌లో 3.3 సెం.మీ, రామాయంపేట 3.1, సెం.మీ, మెదక్‌ 3.06 సెం.మీ, నిజామ్‌పేటలో 2.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement