Friday, April 26, 2024

Congress Josh | మరో పాదయాత్రకు రాహుల్ రెడీ.. ఈసారి గుజ‌రాత్ నుంచి అసోం వ‌ర‌కు

ఈ మ‌ధ్య‌నే భారత్ జోడో యాత్ర ముగించుకున్న కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన సుదీర్ఘ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం రాహుల్ గాంధీతోపాటు.. కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. అదే ఊపులో రాహుల్ ఈసారి పశ్చిమ తీరంలోని గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రం అసోం వరకు పాదయాత్ర చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర గుజరాత్ లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోరుబందర్ లో మొదలై అసోంలో ముగుస్తుందని కాంగ్రెస్ నేత‌లు కొంత‌మంది అంటున్నారు.

జాతిపిత మహాత్మాగాంధీ జన్మస్థలంగా పోరుబందర్ కు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశం జరగనుంది. రాహుల్ తాజా పాదయాత్రపై ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఈ పాదయాత్రకు ఇంకా తేదీలు ఖరారు కాలేదని, బహుశా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కానీ, ఈ ఏడాది చివరలో కానీ ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement