Monday, May 20, 2024

లైన్‌మ్యాన్‌ ఖాళీల భర్తీ పరీక్షలో ప్ర‌శ్నాపత్రం లీక్‌.. కేసు దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ విద్యుత్‌ శాఖలో జూనియర్‌ లైన్‌మ్యాన్ల ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. లీకేజీకి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేయడంలో విద్యుత్‌శాఖ ఉద్యోగులే కీలక సూత్రదారులుగా పోలీసులు గుర్తించారు. ఈ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న ఫిరోజ్‌ ఖాన్‌, లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌లను ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితులు మైక్రోఫోన్‌ సహాయంతో అభ్యర్ధులకు సమాధానాలు చేరవేశారని విచారణలో బయటపడింది. ప్రశ్నాపత్రం బయటకు ఇచ్చేందుకుగానూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.ఐదు లక్షలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అడ్వాన్స్‌గా ఒక్కొక్కరిని నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఈ లీకేజీకి సంబంధించి నమోదైన కేసుల్లో ప్రత్యేక పోలీసులు బందాలు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కీలక నిందితులు పరారీలో ఉండడంతో వారి కోసం గాలింపు చర్యలు ఉధృతం చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement