Sunday, May 5, 2024

National: సుద‌ర్శ‌న సేతును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ..

గుజరాత్‌లోని ద్వారకాలో భారత్‌లోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుద‌ర్శ‌న సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఓఖా, బెయిత్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ వంతెనని నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.979 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఓల్డ్ ద్వారకా, న్యూ ద్వారకాని ఇది అనుసంధానం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు లేన్‌లతో ఈ నిర్మాణం చేపట్టారు. 27.20 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఫుట్‌పాత్ కోసం 2.50 మీటర్ల వెడల్పుని కేటాయించారు. ఈ ఫుట్‌పాత్‌నీ చాలా ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. గోడలపై భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పెయింట్ చేశారు. ముందు దీన్ని సిగ్నిచ‌ర్ బ్రిడ్జ్‌గా చెప్పిన ప్రభుత్వం ఆ తరవాత సుదర్శన్ సేతు అనే పేరు పెట్టింది. ఓఖా పోర్ట్‌కి సమీపంలో ఉన్నబేట్ ద్వారకలో శ్రీకృష్ణుడి ద్వారాకాధీష్ ఆలయం ఉంది. ఈ వంతెనను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరవాత గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి ఎఐఐఎంఎస్‌ హాస్పిటల్‌ని ప్రారంభిస్తారు. కేబుల్ బ్రిడ్జ్‌ని ప్రారంభించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించారు.

ద్వారకా నగరం నుంచి ద్వారకాధీష్ ఆలయానికి 30 కిలోమీటర్ల దూరం. అయితే…ఇప్పటి వరకూ ఈ ఆలయాన్ని సందర్శించాలంటే పడవల్లోనే వచ్చి పోతుండే వారు. ఇప్పుడు ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఈ సమస్య తీరిపోయినట్టైంది. రాజ్‌కోట్‌లోని ఎఐఐఎంఎస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోనూ కొత్తగా నిర్మించిన ఎఐఐఎంఎస్‌లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement