Wednesday, May 1, 2024

ప‌ర్మిష‌న్ లేకుండానే ఫార్మసీ కాలేజీలు.. విద్యార్థుల భవిష్యత్‌కు శాపం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉద్యోగాల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 480 ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వటంతో సరైన, పూర్తిస్థాయి అనుమతులు లేని ఫార్మసీ కాలేజీల బండారం బయట పడుతోంది. రోజులకో బోగస్‌ ఫార్మసీ కాలేజీ వ్యవహారం వెలుగు చూస్తోంది. తాజాగా శాత ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ సైన్సెస్‌ లో చదువుకున్న 120 మంది విద్యార్థులు రోడ్డుపాలైనట్లు తెలంగాణ ఫార్మా సొసైటీ ఆరోపిస్తోంది. హుజురాబాద్‌లో ఉన్న కాలేజీలో చదివిన 120 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ ఫార్మాసిస్టుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు. ఫార్మసీ డిగ్రీతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కూడా వీరికి లేకుండా పోయింది. ఈ కాలేజీలో చదువుకున్న 120 మంది భీఫార్మసీ విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని తెలంగాణ ఫార్మా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. శాత ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ తరహా అనుమతుల్లేని కాలేజీలు తెలంగాణలో మరిన్ని ఉన్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సదరు యూనివర్సిటీలు అనుమతులు, గుర్తింపునిచ్చే విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటం మూలంగానే విద్యార్థులు రోడ్డున పడుతున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం… ఫార్మసీ కాలేజీలు ప్రతి ఏటా ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతిని పొందుతూ ఉండాలి. ప్రతీ ఏటా ఆ అనుమతిని రెన్యువల్‌ చేసుకోవాలి. అనుమతులు పక్కాగా ఉన్నా కాలేజీలనే ఉన్నత విద్యా మండలి, ఆయా యూనివర్సిటీలు ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ లిస్టులో కాని, మరో సందర్బంలో గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఫార్మసీ పోస్టుల భర్తీ కి పచ్చజెండా ఊపటంతో… అన్ని ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఉన్న ఫార్మసీ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తోంది. ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఉన్న కాలేజీల్లో మూడేళ్లపాటు బీఫార్మసీ చదువుకున్న విద్యార్థులు కోర్సు అయిపోయాక రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ నుంచి రిజిస్టర్డ్‌ ఫార్మాసిస్టు సర్టిఫికెట్‌ సదరు విద్యార్థికి లభిస్తుంది. ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే త్వరలో భర్తీ కాబోయే 480 ఫార్మసిస్టు పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా ఫార్మసీ కాలేజీలు లాబీయింగ్‌ ద్వారా పక్కా అనుమతులు లేకుండానే కొనసాగుతుండటంతో ఈ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు రిజిస్ట్రర్డ్‌ ఫార్మసిస్టు సర్టిఫికెట్‌ రావటం కష్టంగా మారింది. దీంతో అనుమతులు పక్కాగా లేని ఫార్మసీ కాలేజీ ల వ్యవహారంవెలుగు చూస్తోంది.

తెలంగాణలో దాదాపు 140 బీఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ప్రతి కాలేజీలో అనుమతులు బట్టి ఒక సెక్షన్‌ ఉంటే 60 సీట్లు, రెండు సెక్షన్లు ఉంటే 120 సీట్లతో ఫార్మసీ విద్యాబోధన జరుగుతోంది. ప్రతి ఏటా దాదాపు 10వేల మంది విద్యార్థులు బీ ఫార్మసీ విద్యను పూర్తి చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ప్రభుత్వ ఫార్మసిస్టు పోస్టుల నోటిఫికేషన్‌ అంశం తెరపైకి రాకపోవటంతో చాలా వరకు ఫార్మసీ కాలేజీలు విద్యార్థులు పాసైన ఏడాది తర్వాత రెండు మూడేళ్ల కాలయాపన చేసి ఎలాగో ఓలాగా సర్టిఫికెట్లను చేతుల్లో పెట్టాయి. మెడికల్‌ షాపు నిర్వహణ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఫార్మసిస్టుల పోస్టుల కు అప్లై సమయంలో లోబీయింగ్‌ ద్వారా మెెనేజ్‌ చేశాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఫార్మాసిస్టు పోస్టులకు రిజిష్ట ర్డ్‌ ఫార్మాసిస్టు సర్టిఫికెట్‌ త ప్పనిసరి కావటం, అది కూడా రానున్న రెండు నెలల్లో అవసరం ఉండటంతో విద్యార్థులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక అనుమతులు లేని ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.

అనుముతులు పక్కాగా లేని ఫార్మసీ కాలేజీలు చాలా ఉన్నాయి: డా. సంజయ్‌రెడ్డి, తెలంగాణ ఫార్మసీ సొసైటీి అధ్యక్షుడు
శాంత ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ మాదిరిగా మరెన్నో పక్కాగా అనుమతులు లేని కాలేజీలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇప్పటికైనా ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, జేఎన్‌టీయూహెచ్‌తోపాటు ఆయా యూనివర్సిటీలు అనుమతులు లేని ఫార్మసీ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫార్మసీ కాలేజీలకు అనుమతులు పక్కాగా లేకపోవటంతో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హలుగా మారుతున్నారు. చాలా ఫార్మసీ కాలేజీల్లో సరైన ల్యాబ్‌ సదుపాయాలు, సరైన ఫ్యాకల్టిd, ప్రిన్సిపాళ్లు తదిర సదుపాయాలు లేవు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement