Thursday, April 25, 2024

పేటీఎం సంచలన నిర్ణయం, ఇన్సూరెన్స్‌ రంగంలో అడుగు.. పీజీఐఎల్‌లో 950 కోట్ల పెట్టుబడి

వన్‌97 కమ్యూనికేషన్స్‌ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పేటీఎం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (పీజీఐఎల్‌)లో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు పేటీఎం సంస్థ ప్రకటించింది. రానున్న 10 ఏళ్ల కాలంలో.. రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు వివరించింది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు పీజీఐఎల్‌ అనేది అనుబంధ సంస్థగా కొనసాగుతున్నది. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇన్సూరెన్స్‌ రంగంలో అడుగపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేటీఎం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌లో 49 శాతం వాటాలను పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ కొనుగోలు చేస్తుంది. మిగిలిన 51 శాతం వాటాలను సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మకు చెందిన వీఎస్‌ఎస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తీసుకుంటుంది.

అంతకుముందు ఈ పీఐజీఎల్‌లో పేటీఎం వాటా 74 శాతం, బీఎస్‌ఎస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వాటా 26 శాతంగా ఉండేది. దీన్ని 49కు కుదించుకుంది. మొదట రహేజా క్యూబీఈ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌గా ఈ ఫర్మ్‌ను నెలకొల్పాలని భావించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. రహేజా క్యూబీఈతో షేర్ల కొనుగోలు ఒప్పందాల్లో జాప్యం చోటు చేసుకుంది. దీంతో వీఎస్‌ఎస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో పేటీఎం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ను నెలకొల్పడానికి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అంగీకారం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement