Sunday, April 28, 2024

ఏపీలో కొత్త కరోనా రూల్స్.. పెళ్లిళ్లకు 150 మందికి అనుమతి

ఏపీలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు పెళ్లిళ్లకు 20 మందికి మాత్రమే అనుమతి ఉండగా.. ఇకపై వివాహాలు, ఇతర శుభకార్యాలతోపాటు మతపరమైన సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య 150కి మించరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

వేదికలు, ఇతర చోట్ల సీట్లు పక్కపక్కనే ఉంటే మధ్యలో ఒకదానిని విడిచిపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీట్లు కనుక ముందుగా అమర్చకుండా ఉంటే ఒక సీటుకు మరో సీటుకు మధ్య 5 అడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఇప్పటికే సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చారు. తాజా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తగిన ప్రణాళిక రూపొందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఈ వార్త కూడా చదవండి: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 13 చోట్ల మినీ పట్టణాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement