36వ నేషనల్ గేమ్స్ గుజరాత్ వేదికగా జరుగనున్నాయి. దాదాపు ఏడేళ్ల అనంతరం జాతీయ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి జాతీయ క్రీడలు నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ) అనుమతించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారంనాడు ట్విట్టర్లో వెల్లడించారు. ”36వ జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు ఈ క్రీడలు గుజరాత్లో జరుగుతాయి. గుజరాత్కు ఈ అవకాశం కల్పించిన ఐవోఏకు కృతజ్ఞతలు” అని భూపేంద్ర పటేల్ తెలిపారు.
గుజరాత్లో అత్యంత ఆధునిక క్రీడా వసతులు, వేదికలు ఉన్నాయి.
తాము ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్ నగరాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. 34 క్రీడా అంశాలుంటే 36వ జాతీయ క్రీడలకు సుమారు 7 వేల మంది క్రీడాకారులు హాజరయ్యే అవకాశముంది. ఈ క్రీడలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నేషనల్ గేమ్స్ చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జరిగాయి. ఆ తర్వాత పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. 2020 మేలో గోవా వేదికగా వీటిని నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వీటిని గత రెండేండ్లుగా వాయిదా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.