Wednesday, May 8, 2024

యూనివర్సిటీలో A2 జన్మదిన వేడుకలు నిర్వహిస్తారా?: లోకేష్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలోని ఏయూలో జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు జ‌రిగాయ‌ని వ‌చ్చిన ఓ దినపత్రికలో ప్రచురించిన వార్త‌ను టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీసీ ప్రసాదరెడ్డి తన ఛాంబరులో కేక్ క‌ట్ చేశార‌ని, ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణమోహన్‌, ఐకాస ఛైర్మన్‌ ఆచార్య రవి తదితరులు పాల్గొన్నారని అందులో పేర్కొన్నారు. వర్సిటీల్లో ఇటువంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డం ఏంట‌ని లోకేష్ మండిప‌డ్డారు.

‘రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు A1 జ‌గ‌న్ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న A2 విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణం. స్వయంగా వీసీనే కుల పిచ్చితో దొంగల జీవితాలను ఆదర్శంగా తీసుకోమని బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు చెప్పడం తీరని అన్యాయం చేయడమే’ అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement