Sunday, May 19, 2024

మ్యూజియంలు విజ్ఞాన గనులు.. ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశ చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు మ్యూజియంలు సరైన వేదికలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు మ్యూజియంలను సందర్శించడాన్ని పాఠ్య ప్రణాళికలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. వివిధ అంశాలపై అవగాహన పెంచుకుని దాన్ని మన చరిత్ర, వర్తమానం, భవిష్యత్‌తో అనుసంధానం చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. గురువారం ఢిల్లీలోని ఓ ఆర్ట్ గ్యాలరీని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు, స్వాతంత్ర్య సమరయోధులు, దేశంలోని వివిధ చారిత్రక ప్రాంతాలు, అక్కడి సంప్రదాయాలు, ప్రత్యేకతలు, మన పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు, నాటి వస్త్ర సంపద, వాటిని నేయడంలో మనవాళ్ల కళాత్మక ఆలోచనలు వంటి ఎన్నో విషయాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు మ్యూజియాలు ఉపయుక్తమవుతాయని ఆయన పేర్కొన్నారు.

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మ్యూజియాల నిర్వాహకులు అలవర్చుకోవాలని, త్రీడీ సాంకేతికతతో బులెటిన్ బోర్డుల ఏర్పాటు, స్క్రీన్ ను టచ్ చేయగానే ఆ వస్తువు విశిష్టత తెలిసేలా ఏర్పాట్లు చేయడం ద్వారా సందర్శకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. ఢిల్లీ వచ్చే విద్యార్థులు కర్తవ్యపథ్, నేతాజీ విగ్రహం, ఇండియాగేట్, ప్రధానమంత్రి సంగ్రహాలయం వంటి వాటిని సందర్శించడం ద్వారా మన చరిత్రను తెలుసుకోవడంతో పాటు వాటి నుంచి స్ఫూర్తి పొందేందుకు వీలవుతుందని కిషన్ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement