Friday, May 17, 2024

మృగశిర కార్తె సంబురం.. మూడు రోజులపాటు ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మృగశిర కార్తెను పురస్కరించుకుని, రాష్ట్రంలో చేపల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో గురువారం నుంచి మూడు రోజులపాటు అన్ని జిల్లాల్లో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫిషర్‌మెన్‌ కో.ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ పిట్టల రవీందర్‌ తెలిపారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాష్ట్ర వ్యాంగా అన్ని జిల్లాల్లో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ముఖ్యనేతలు ఈ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.

ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ విషయమై బుధవారం మాసబ్‌ట్యాంకులోని మత్స్యభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలోనూ 20 నుంచి 30 వరకు ఫిష్‌ ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేసి, సరసమైన ధరల్లో వివిధ రకాల చేపల వంటకాలను వడ్డించనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఫెస్టివల్‌లో పాల్గొనాలని కోరారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని శుక్రవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిపారు.

- Advertisement -

చేప ప్రసాదం కోసం అవసరమైన దాదాపు 2లక్షల కొర్రమీను చేప పిల్లలను సమకూర్చామన్నారు. దాదాపు 300 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి 40 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేప ప్రసాద పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దా ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 8న గురువారం ఊరూరా చెరువుల పండగను నిర్వహించనున్నట్లు తెలిపారు.

చెరువుల పండగ అంటే చేపల పండుగ అని స్పష్టం చేశారు. మత్స్యకారుల సొసైటీ సభ్యులు, చెరువుల లైసెన్స్‌దారులు, మహిళా మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరూరా చెరువుల పండగను ఘన ంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మత్స్యశాఖ, ఫిషరీస్‌ ఫెడరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా ల బ్దిపొందిన మత్స్యకారులు వాహనాలతో, వలలు తదితర వృత్తిపరమైన పనిముట్లతో చెరువుల పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement