Monday, April 29, 2024

Patna: మృత్యువు దూసుకెళుతున్నా.. చిన్నారులకు రక్షణ కవచంలా మారిన త‌ల్లి

తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డల్ని త‌ల్లి రక్షించుకుంది. తనపై నుంచి మృత్యువు దూసుకెళుతున్నా.. చిన్నారులకు రక్షణ కవచంలా మారింది. ఈ ఘటన శనివారం బిహార్‌లో చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన ఓ మహిళ కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లేందుకు పయనమైంది.

బార్హ్‌ రైల్వేస్టేషన్‌లో విక్రమశిలా ఎక్స్‌ప్రెస్‌ కోసం వేచిఉంది. అంతలో రైలు స్టేషన్‌కు చేరుకోవడంతో.. దానిలోకి ఎక్కేందుకు అక్కడున్న వారంతా ఎగబడ్డారు. ఆ గుంపులో ఇరుక్కుపోయి ప్రమాదవశాత్తు తన ఇద్దరి చిన్నారులతో సహా ఆమె పట్టాలపై పడిపోయింది. ఇంతలో రైలు కదలడం ప్రారంభించింది. అది గమనించిన ఆ తల్లి తన బిడ్డలను రక్షించుకోవాలనుకుంది.

అంగుళం దూరంలో మృత్యువు ఉండగా.. తన పిల్లలను దగ్గరకు లాక్కొని వారిపై తను పడుకొంది. రైలు వెళ్లిపోయేంత వరకు అలాగే కదలకుండా ఉంది. దీంతో రైలు ఆమె శరీరానికి అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లింది. అనంతరం అక్కడున్న వారు పట్టాలపై దూకి తల్లీబిడ్డలను పైకి చేర్చారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement