Tuesday, April 30, 2024

అర్ధరాత్రి రెవెన్యూ అధికారుల అగచాట్లు

ఆర్మూర్ ప్రభ న్యూస్ ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీఆర్ఏలను వారి విద్యార్హతలను బట్టి పదోన్నతులను కల్పిస్తూ వెలువరించిన జీవో ఆధారంగా వారిని రెగ్యులరైజ్ చేస్తూ జీవో జారీ చేసిన విషయం విధితమే. అయితే వీరి రెగ్యులర్ జీవోను, పదోన్నతులను సవాలు చేస్తూ ఇతర శాఖల వారు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో రెవెన్యూ శాఖలో అలజడి మొదలైంది. రాత్రికి రాత్రే విఆర్ఏలను బదిలీ చేస్తూ ఆర్డర్ కాపీలను జారీ చేస్తున్నారు. ఒక్కసారిగా హైకోర్టు ఉత్తర్వులతో రెవెన్యూ అధికారులు ఆగమైపోయి అర్థరాత్రి వరకు కార్యాలయాల్లో దొడ్డిదారిన వీఆర్ఏల బదిలీ ఉత్తర్వుల కాపీలను పంపిణీ చేస్తున్నారు.

దీనికి తార్కానంగా నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయం వేదికైంది. వేల్పూర్ మండల కేంద్రానికి సంబంధించిన వీఆర్ఏ బదిలీల ఉత్తర్వులను సైతం ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయంలో పంపిణీ చేయడం విస్మయం కలిగించింది. విషయం తెలుసుకున్న వివిధ దినపత్రికల మీడియా ప్రతినిధులు వెళ్లి అధికారులను ప్రశ్నించగా, దాటవేసే సమాధానం చెబుతూ గృహలక్ష్మికి సంబంధించిన అప్లికేషన్లను తనిఖీ చేస్తున్నామని బుకాయించారు. కానీ వీఆర్ఏలు తమ బదిలీ ఉత్తర్వుల ఆర్డర్ కాపీలను చేతిలో పట్టుకొని బయటకు వస్తున్న వైనాన్ని అక్కడున్న మీడియా ప్రతినిధులు చిత్రీకరించారు.

దీంతో అధికారులు అసత్యపు మాటలు చెబుతున్నారన్న విషయం తేటతెల్లమైంది. అర్ధరాత్రి వరకు అధికారులు పనిచేయాల్సిన అవసరం ఏంటని మీడియా ప్రతినిధులు కొందరు వారిని ప్రశ్నించారు. వారు తడబడుతూ సమాధానం చెప్పారే తప్ప, అర్ధరాత్రి వరకు ఆర్డర్ కాపీలను వీఆర్ఏలకు అందజేస్తున్న విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఉదంతమంతా జిల్లా అధికారులకు తెలిసి జరిగిందా లేక అధికారులే అత్యుత్సాహం ప్రదర్శించారా అన్న విషయం బయట పడాల్సి ఉంది.

- Advertisement -

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను దిక్కరిస్తూ రాత్రికి రాత్రే బదిలీ ఉత్తర్వులను అందజేయడంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో, రెవెన్యూ శాఖ అధికారులపై ఏ మేరకు చర్యలు ఉంటాయో వేచి చూడాలి. ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement