Monday, April 29, 2024

టాటా విమానయాన సంస్థల విలీనం… ఒకె కూట‌మిగా ఏర్పాటు

టాటాసన్స్‌ ఆధ్వర్యంలోని అన్ని విమానయాన సంస్థల్ని ఒకే గొడుగుకిందకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్‌ దాని పునరుద్ధరణలో భాగంగా విలీన యోచన చేస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఈ క్రమంలో విస్తారా బ్రాండ్‌ను పూర్తిగా రద్దు చేయనున్నారు. ప్రస్తుతం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్‌ ఈ విమానయాన సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు విలీనం తర్వాత ఏర్పడే పెద్ద సంస్థలో ఎస్‌ఐఏకు ఇవ్వాల్సిన వాటాపై చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.

దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెల్లడికాలేదు. అయితే, టాటాతో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చర్చలు కొనసాగుతున్నాయని ఇటీవల ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో ఎస్‌ఐఏ పేర్కొనడం గమనార్హం. విస్తారాతోపాటు ఎయిరేషియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఎయిరిండియాలో కలిపేలా టాటా సన్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఎయిరిండియా విమానాల సంఖ్యను మూడింతలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ గతనెలలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎయిర్‌బస్‌, ఐదు బోయింగ్‌ పెద్ద విమానాలకు ఆర్డర్‌ కూడా ఇచ్చారు. దేశీయ విమానయాన వాటాలో 30శాతం చేరుకోవాలన్నది సమీపకాల లక్ష్యంగా ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement