Sunday, April 28, 2024

8న తొర్రూరుకు కేటీఆర్ రాక : మంత్రి ఎర్రబెల్లి

  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • అదే రోజు కేటీఆర్ నోట మహిళలకు ఓ శుభ వార్త చెప్పే అవకాశం
  • 20 వేల మంది మహిళలతో భారీ బహిరంగ సభ
  • హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం తొర్రూరు పట్టణ అభివృద్ధి మీద సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తారు. ఆ తర్వాత కనీవినీ ఎరగని రీతిలో 20 వేల మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడతారు. అలాగే అదే రోజు కేటీఆర్ నోట డ్వాక్రా మహిళలకు ఓ శుభ వార్త చెప్పే అవకాశం ఉంది. ఈ సభ ఏర్పాట్లపై పాలకుర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో తొర్రూరులోని మిషన్ భగీరథ అతిథి గృహంలో ఆదివారం సమీక్షించారు. అనంతరం పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. అలాగే అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. ఏర్పాట్ల పై అధికారులతో చర్చించారు. కేటీఆర్ సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంత్రి ఎర్రబెల్లి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ సభ, జన సమీకరణ పై చర్చించారు. కేటీఆర్ రాక సందర్భంగా తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మాట్లాడారు. ఆ రోజు కేటీఆర్ ను అభ్యర్థించాల్సిన అంశాలపై చర్చించారు. ఇక ఇదే సమయంలో అటు అధికారులు, ఇటు పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు. వారి వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించడం తో పాటు, పూర్తిగా తొర్రూరు లోనే ఉండి, ఆరోజు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఈ సమీక్ష, ఆయా స్థలాల పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, DRDO, RDO, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement