Thursday, April 25, 2024

హద్దు మీరితే ‘షాక్’ ట్రీట్మెంట్? విమానాల్లో ప్రయాణికుల దురుసు ప్రవర్తనపై పరిశీలనలో ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విమానాల్లో హద్దు మీరి ప్రవర్తించే ప్రయాణికులను కట్టడి చేయడం కోసం ప్రాణాపాయం కల్గించని ఆయుధాల వినియోగించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం సమావేశమై ఈ అంశాలపై చర్చించినట్టుగా తెలిసింది. కమిటీ చైర్మన్ వి. విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పౌరవిమానయాన రంగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు న్యాయశాఖకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఈమధ్య న్యూయార్క్-న్యూఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ తోటి ప్రయాణికురాలిపై మరో ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ తరహాలో విమానాల్లో ప్రయాణికులు హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు మరికొన్ని వెలుగు చూశాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఓ విమానంలో అత్యవసర ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ తరహా ఘటనలను నివారించడం కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయసాయి రెడ్డి పౌరవిమానయాన శాఖకు లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశం గురించే లోతుగా చర్చ జరిగినట్టు తెలిసింది.

- Advertisement -

నాన్-లీథల్ (ప్రాణాపాయం లేని) ఆయుధాలను ఉపయోగించి హద్దుమీరి ప్రవర్తించే ప్రయాణికులను కట్టడి చేసే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. మనిషిని కొన్ని క్షణాలు లేదా నిమిషాల పాటు అచేతనావస్థలోకి తీసుకెళ్లే తరహా ‘షాక్’ ట్రీట్మెంట్ ఆయుధాలు (టీజర్, స్టన్ గన్) వినియోగించే అంశంపై న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఆ మేరకు స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement