Thursday, May 16, 2024

వాహనాల తనిఖీ.. పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం

నర్సంపేట, ప్రభన్యూస్‌: ఈ రోజు (మంగళవారం) ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. పట్టణ కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, పలు విషయాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ కేంద్రంలోని పాఖాల సెంటర్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో ఎండు గంజాయి లోడ్‌ను భద్రాచలం నుండి నారాయణ్‌ ఖేడ్‌ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో కూడిన బొలెరో వాహనం పాకాల కొత్తగూడ వైపు నుండి వస్తున్న క్రమంలో గుర్తించగా, పోలీసులను చూసి బొలెరో వాహనంతో తప్పించుకునే ప్రయత్నం చేయగా పట్టణ శివారు మెగా గ్యాస్‌ కంపెనీ వద్ద పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులలో ఒకరు తప్పించుకోగా, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పట్టుబడిన వ్యక్తి నారాయణ్‌ ఖేడ్‌లోని పిప్రి గ్రామానికి చెందిన వడ్త్య హన్మనాయక్‌(25)గా గుర్తించినట్లు, విచారించగా తన స్నేహితుడైన(పారిపోయిన వ్యక్తి) మారుతితో కలిసి భద్రాచలం చుట్టు ప్రక్క గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఎండు గంజాయిని కొనుగోలు చేసినట్లు, బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు తెలిపారన్నారు. గంజాయిని 278 పొట్లాలుగా తయారు చేసినట్లు, బరువు సుమారు 550కిలోలు ఉంటుందని, విలువ 55,50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు, బొలెరో వాహనం మరియు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టు కోవడంలో ప్రతిభ కనబర్చిన ఏసీపీ సంపత్‌ రావు, సీఐ పులి రమేష్‌ గౌడ్‌, ఎస్సై ఏ.సురేష్‌, కానిస్టేబుళ్లు ఎండీ కలిమొద్దిన్‌, కె.సునిల్‌, కె.రవిలను డీసీపీ అభినందించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement