Saturday, May 18, 2024

Delhi | విపక్ష కూటమిలోకి ఐఎన్ఎల్డీ.. సెప్టెంబర్ 25న ముహూర్తం!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండి-కూటమి)లోకి త్వరలో మరో కొత్త పార్టీ చేరనుంది. సెప్టెంబర్ 25న మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా హర్యానాలోని కైతాల్‌లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్డీ) భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇండి కూటమిలోని పార్టీల నేతలందరినీ ఆ సభకు ఆహ్వానించింది. విపక్షాల ఐక్యతను చాటే వేదికగా ఈ సభను మార్చి, అదే వేదికపై ఇండి కూటమిలో చేరే విషయంపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

దేవీలాల్ గౌరవార్థం జరుగుతున్న ఈ భారీ సభకు వివిధ విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్టు ఆ పార్టీ నేత అభయ్ చౌతాలా తెలిపారు. చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో అభయ్ చౌతాలా, జేడీ(యూ) నేత కేసీ త్యాగి సంయుక్తంగా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాము కూడా కోరుకుంటున్నామని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలుస్తానని ప్రకటించారు.

తాము తలపెట్టిన బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఇప్పటికే ఆహ్వానం పంపామని తెలిపారు. అయితే వారు హాజరవుతున్నారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇండి కూటమిలో ఉన్న 95% పార్టీలు తమ సభకు హాజరవుతామన్నారని చౌతాలా తెలిపారు. కొన్ని పార్టీల అధినేతలు నేరుగా హాజరవుతుండగా, మరికొందరు తమ ప్రతినిధులను పంపిస్తున్నారని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ సమయంలో విదేశాల్లో ఉంటానని చెప్పారని, ఆమె కూడా హాజరైతే బావుండని తాము కోరుకుంటున్నట్టు చౌతాలా అన్నారు.

- Advertisement -

ఆమె హాజరుకాలేని పక్షంలో ఆ పార్టీ ప్రతినిధిగా ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ హాజరవుతారని తెలిపారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత ఆదిత్య ఠాక్రే హాజరవుతారని, శిరోమణి అకాలీదళ్ తరఫున ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సైతం హాజరవుతానని చెప్పారన్నారు. అయితే సుఖ్‌బీర్ ఇండి-కూటమిలో చేరతారా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సీట్ల పంపకం, సర్దుబాటులో భిన్నాభిప్రాయాలు తలెత్తిన చోట ముక్కోణపు లేదా చతుర్ముఖ పోటీకి సైతం ఇండి-కూటమి సిద్ధంగా ఉందని కేసీ త్యాగి తెలిపారు.

పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన స్థానిక నేతలు సీట్ల పంపకం, ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై చేస్తున్న ప్రకటనలపై కేసీ త్యాగి మాట్లాడుతూ, ఈ ప్రకటనల్లో అర్థం లేదని, తుది నిర్ణయం ఆయా పార్టీల అధిష్టానమే తీసుకుంటుందని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నారని, పంజాబ్ సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ స్థానిక నాయకుల ప్రకటనలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సీట్ల పంపకం, ఏ రాష్ట్రంలో ఎలా పోటీ చేయాలన్న విషయంపై ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సెప్టెంబర్ 25న కైతాల్‌లో జరిగే చౌదరి దేవిలాల్ సమ్మాన్ దివాస్ సభకు ఇండి కూటమి భాగస్వామ్య పార్టీల నేతలందరినీ రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, అయితే అది రాజకీయ కార్యక్రమం కాదని కేసీ త్యాగి అన్నారు. దేశ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్ గౌరవార్థం జరిగిన ఈ సభలో అన్ని పార్టీలు ఏకమవుతాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement