Friday, May 3, 2024

Indravelli – జ‌ల్ జంగిల్ జ‌మీన్‌ – ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి 43 ఏళ్లు

అడ‌విపై హ‌క్కుల కోసం ఆదివాసీల పోరాటం
అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి సీతక్క
శ్రద్ధాంజలి ఘటించి స్మరించుకున్న ఆదివాసీలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్): మరో జలియన్ వాలాభాగ్ దురంతంగా చరిత్ర పుటల్లో కెక్కిన ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు సరిగ్గా 43 ఏళ్లు నిండాయి. జల్ ..జంగల్.. జమీన్ నినాదంతో భూమి, భుక్తి అడవి పై హక్కు కోసం ఆదివాసీలు సంఘటితమై 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి లో సభ నిర్వహించారు. పోలీసుల అనుమతి లేదంటూ అధికారులు ఘీoకరించి సభను రద్దు చేయాలని నిషేధాజ్ఞలు విధించారు. పోలీసుల ఆదేశాలు బే ఖాతరు చేయడoతో అప్పటి ఆర్డీవో కాల్పులకు ఆదేశించారు. కాల్పుల్లో 13 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా, అనధికారిక లెక్కల ప్రకారం 113 మంది చనిపోయినట్టు ఆదివాసులు పేర్కొన్నారు. అయితే మరుసటి సంవత్సరమే కాల్పుల ఘటన స్థలిలో అమరవీరుల స్థూపం నిర్మించిన ఆదివాసీలు ప్రతి ఏటా అక్కడ నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది.


నివాళులర్పించిన సీతక్క
అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఇంద్రవెల్లిలో ఈరోజు మధ్యాహ్నం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన ధనసరి సీతక్క మృత వీరులకు నివాళులు అర్పించారు. కాల్పుల ఘటనను దురదృష్టక సంఘటనగా పేర్కొంటూ అమరవీరుల ఆశయాలు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆదివాసి సంఘాలు స్మారక స్థూపం వద్ద ప్రత్యేక సాంప్రదాయ పూజలు నిర్వహించి అమరవీరులను స్మరించుకుంటూ మౌనంగా నివాళులర్పించారు. అమరవీరులకు జోహార్లు అన్న నినాదాలు ఇంద్రవెల్లి అడవుల్లో మార్మోగాయి. అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తుఫాన్ వద్ద పూజలు చేసి నివాళులర్పించారు. పాల్పులు జరిగి నలభై ఏళ్లు దాటినా ఇంకా భూమి కోసం ఆదివాసి బిడ్డలు పోరాడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఎందరు మారినా పోడు భూముల సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలంతా సంఘటితమై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement