స్నేక్ ఐలాండ్ నుంచి తప్పుకున్న రష్యా ఉక్రెయిన్పై దాడులను మాత్రం పెద్దఎత్తున కొనసాగిస్తోంది. తాజాగా శనివారం ఉదయం ఉక్రెయన్లో పెద్ద పట్టణం మైకొలైవ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ విషయాన్ని మైకొలైవ్ మేయర్ ధ్రువీకరించారు. శుక్రవారం పోర్టునగరం ఒడెశాపై క్షిపణులతో రష్యా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 21మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా పౌరులే లక్ష్యంగా మాస్కో దాడులకు పాల్పడుతోందని, ఇది దారుణమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేయగా తాము సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని క్రెవ్లిున్ అధికార ప్రతినిధి దిమిత్రి పెసకోవ్ ప్రకటించారు. కాగా తూర్పు ఉక్రెయిన్లోని లిసిచాన్స్క్తోపాటు శివారు ప్రాంతాలపైనా రష్యా బలగాలు బాంబులతో దాడి చేశాయి.
లుషాంక్ ప్రావిన్స్ను స్వాధీనం చేసుకునేందుకు చివరి ప్రయత్నంగా రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజారిటీ ప్రాంతాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతంలో అతిపెద్ద పారిశ్రామిక పట్టణమైన సీవీరోడోనెట్స్కీ రష్యా వశమైన సంగతి తెలిసిందే. కాగా లిసిచాన్స్క్లో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణశాఖ శనివారం ప్రకటించింది. కాగా లుషాంక్ గవర్నర్ సెరిహి హైడై మాత్రం దీనిని ఖండించారు. ఇంకా అక్కడ ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.