Thursday, April 25, 2024

హెలీనా మిస్సైల్‌ ప్రయోగం సక్సెస్‌, హెలికాప్టర్‌ నుంచి లక్ష్య ఛేదన..

దేశీయంగా అభివృద్దిచేసిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ (ఏటీజీఎం) హెలినాను భారత్‌ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ నుంచి గరిష్టఎత్తులో దీనిని డీఆర్‌డీవో పరీక్షించింది. ఈ ప్రయోగం ద్వారా హెలిక్టాప్టర్‌తో క్షిపణిని అనుసంధానం చేసే మార్గం సుగమం అయిందని రక్షణమంత్రిత్వశాఖ పేర్కొంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో నిర్వహిస్తున్న వరుస ట్రయల్స్‌ నేపథ్యంలో తాజా పరీక్ష చేపట్టారు. హెలీనా లేదా హెలికాప్టర్‌ అధారిత నాగ్‌ క్షిపణి ఏడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ సీకర్‌ సిస్టమ్‌ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ క్షిపణి ఎత్తయిన శ్రేణులవద్ద అనుకరణ ట్యాంక్‌ లక్ష్యాన్ని ఛేదించింది. డీఆర్‌డీవో, భారత వైమానికదళం, సైన్యం సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి.

హెలీనా వ్యవస్థలు పగలు, రాత్రి అన్ని వాతావరణ సామర్థ్యాలను కలిగివుంది. సంప్రదాయ పేలుడు రియాక్టివ్‌ కవచంతో శత్రు ట్యాంకులను ధ్వంసంచేయగలదు. క్షిపణి డైరెక్ట్‌ హిట్‌ విధానంతోపాటు, టాప్‌ అటాక్‌ విధానంలోనూ లక్ష్యాలను ఛేదించగలదని డీఆర్‌డీవో తెలిపింది. తాజా పరీక్ష మా స్వదేశీ ఆయుధ నిర్మాణ పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు హెలికాప్టర్‌లో క్షిపణిని ఏకీకృతం చేయడం, సాయుధ దళాలలో ఆయుధ ఉత్పత్తి, కార్యాచరణపై దృష్టిపెట్టాలి అని సెంటర్‌ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ అనిల్‌ గోలానీ (రిటైర్డ్‌)అన్నారు. రక్షణ తయారీలో స్వావలంబనను పెంచేందుకు ప్రభుత్వం దిగుమతి నిషేధం విధించిన ఆయుధాలు, వ్యవస్థల జాబితాలో యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులు కూడా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement